కంట్రోల్ కేంద్రం ద్వారా సత్వర స్పందన కమిషనర్ హరిత నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ హరిత ఆదేశించారు. భారీ వర్షాలకు నగరంలోని మాగుంట లే అవుట్, వనంతోపు, ఇస్కాన్ టెంపుల్ తదితర ప్రాంతాలలో ప్రధాన డ్రైను మార్గాలు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జ్ ల పరిస్థితిని అధికారులతో కలిసి కమిషనర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. వర్షాల నేపధ్యంలో సమస్యలు కలిగినవారు 18004251113,0861 230 1541 నెంబర్లకు సమాచారం అందించి నగర పాలక సంస్థ నుంచి తగిన సహాయం పొందాలని కమిషనర్ సూచించారు. రహదారులు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా తోడివేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాలు, హోర్డింగులు సమీపంలో నిలవడం, వాహనాలు పార్క్ చేయడం, విద్యుత్ స్థంబాలను చేతితో తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు, ఇండోర్ , ఔట్ డోర్ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు అందరికీ సెలవులు రద్దు చేస్తున్నామని, ఆదేశాలు అందిన వెంటనే సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు. భారీ వర్షాలకు వరద నీరు పెరుగుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కార్పొరేషన్ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించి పునరావాసం పొందాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.